
- కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స.. మరో భుజానికి రెండు నెలల్లో ఆపరేషన్
ముంబై, జూలై 11: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉండటంతో వైద్యుల సూచన మేరకు ముందుగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేపట్టారు.
సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు తెలిపారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స నిర్వహిస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, దశలవారీగా చికిత్స చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే శస్త్రచికిత్స నిర్వహించగా, ఎడమ భుజానికి మరో రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.