నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న
ఇద్దరు వ్యాపారుల అరెస్టు

కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు
కరీంనగర్ బ్యూరో, జూన్ 6 (విశ్వం న్యూస్) : ఎటువంటి లైసెన్సులు లేకుండా నకిలీ లేబుళ్లు అంటించి నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను మంగళవారం నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, మానకొండూరు పోలీసులు అరెస్టు చేశారు. సుల్తానాబాద్ స్వప్న కాలనీకి చెందిన నూక రాజేశం (40), వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన ఇరుకుల్ల వేద ప్రకాష్ (54), పెద్దపల్లికి చెందిన సతీష్ లు ఒక ముఠాగా ఏర్పడి కల్తీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. పై వ్యక్తులు గతంలో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేసి నష్టపోయారు.
స్వల్ప కాలంలో ఎక్కువ డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో గతంలో పరిచయం ఉన్న రైతులను లక్ష్యంగా పెట్టుకొని ఈ నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే చర్యలకు పాల్పడుతున్నారు. రైతులకు అధిక దిగుబడిలో వస్తాయని ఆశ చూపుతూ గడువుతీరిన బిజి 2 పత్తి విత్తనాలను బిజీ 3 విత్తనాలుగా చెబుతూ రైతులకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. వారి కదలికల పై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ విభాగం, మానకొండూరు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు వద్ద నిఘా ఉంచి టీఎస్ 03 ఈ ఎల్ 7185 కారులో అక్రమంగా రవాణా చేస్తున్న విత్తనాలతో వీరిని పట్టుకున్నారు. వీటి విలువ ఒక లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.

పైన పేర్కొన్న వ్యాపారుల్లో పెద్దపల్లికి చెందిన వ్యాపారి సతీష్ పరారీలో ఉన్నాడు. పట్టుబడిన ఇద్దరు వ్యాపారులు నూక రాజేశం, ఇరుకుల్ల వేద ప్రకాష్ వద్ద నుండి అష్టలక్ష్మి లేబుళ్లు అంటించి ఉన్న 19 స్టీల్ బాక్సులు, సాయి దివ్య పేరిట లేబుళ్లు అంటించి ఉన్న 31 ప్యాకెట్లు, మరో 20 ఖాలి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.అధిక దిగుబడులు వస్తాయని ఆశ చూపుతూ రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడే వ్యాపారులు పై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామని ప్రభుత్వం రైతులు నష్టపోకుండా రక్షణ కల్పించేందుకు పటిష్ట చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు.
రైతులు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను కొనుగోలు చేసే సందర్భంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నామని రైతులకు ఎక్కువ దిగుబడులు వస్తాయని ఆశ చూపి మోసాలకు పాల్పడిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులను మోసం చర్యలు చేసే చర్యలకు పాల్పడే వ్యక్తుల వ్యాపారుల పై అవసరమైతే పీడీ యాక్ట్ లను కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి విజయ సారధి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, యం రవికుమార్, మానకొండూరు సిఐ రాజ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.