
- UPI గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యూపీఐ పేమెంట్స్పై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని, పూర్తిగా ఉచితమని పేర్కొంది.
హైదరాబాద్, మార్చి 29 (విశ్వం న్యూస్) : యూపీఐ (UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని చాలా మందిలో సందేహం నెలకొంది. కానీ, దాంట్లో వాస్తవం లేదు. వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదు. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్స్ ద్వారా చెల్లింపులు ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్స్ వాడుతున్న వారిలో ఆందోళన నెలకొంది.
అయితే, తాజాగా ఆయా వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో (upi payment charges news) నిజం లేదని స్పష్టం చేసింది. గూగుల్ పే (Google Pay), ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ నుంచి బ్యాంక్కు చేసే పేమెంట్స్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు ఈ రోజు ఓ ప్రకటన జారీ చేసింది.
