కాంగ్రెస్, బీఆర్​ఎస్​ కుటుంబ.. అవినీతి పార్టీలే

కాంగ్రెస్, బీఆర్​ఎస్​ కుటుంబ..
అవినీతి పార్టీలే:కిషన్ రెడ్డి

  • కేంద్రమంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

వరంగల్, జూలై 8 (విశ్వం న్యూస్) : ప్రధాని కార్యక్రమాన్ని బీఆర్​ఎస్​ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని కేంద్రమంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా.. లేక రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు ఇస్తున్నందుకు బహిష్కరించారా అని బీఆర్​ఎస్​​కు ప్రశ్నల వర్షం కురిపించారు. బహిష్కరించాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ముందుగా.. హామీలు ఇచ్చి తప్పినందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేపర్ లీకేజీ ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినందుకు యువత.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు రైతులు కేసీఆర్​ను బహిష్కరించాలని కోరారు. హనుమకొండలోని బీజేపీ విజయసంకల్ప సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్​ఎస్, బీజేపీ ఒకటే అనే దుష్ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ ఎప్పటికీ బీఆర్​ఎస్​తో కలవదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ కుటుంబ.. అవినీతి పార్టీలేనని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల డీఎన్​ఏ ఒక్కటే.. వీటికి రానున్న రోజుల్లో భవిష్యత్తు అనేది ఉండదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్లేనని ఆరోపించారు.

ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి..
కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు’
మోదీ ప్రధాని అయ్యాకే జాతీయ రహదారులు మెరుగయ్యాయని కేంద్ర మంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అలాగే రూ.1900 కోట్లతో హైదరాబాద్-వరంగల్ రహదారిని మంజూరు చేశామన్నారు. ఇవాళ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

తెలంగాణకు ఇప్పటివరకు కేంద్రం రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టాం : కేంద్రం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడించారు. 2024 నాటికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాది, దక్షిణాదిని అనుసంధానిస్తూ రహదారులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సూరత్‌ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కర్నూలు మీదుగా రహదారి నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించాలని కోరుకున్నారు. పట్టణాలకు రహదారుల వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ మంచి రహదారులు వేశామని హర్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *