నీళ్ల కోసం రైతుల ధర్నా

నాగారం,మార్చి 11 (విశ్వం న్యూస్) నాగారం మండలంలో సాగునీటి సమస్య తీవ్రమవడంతో రైతులు ఆందోళనకు దిగారు. కాలువల్లో నీరు విడుదల కాకపోవడంతో పొలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వరి, మక్క వంటి పంటలను సాగు చేసుకున్నప్పటికీ కాలువల్లో నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఎకరాలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు నీటి కొరత కారణంగా నష్టపోతున్నాయని వారు వాపోయారు.
సాగునీటి సమస్యపై పలుమార్లు ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని రైతులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాలువల్లో వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరారు. అధికారులు స్పందించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.