రాష్ట్రంలో కూల్చిన ప్రతి ఇంటికి పట్టాలు ఇవ్వాలి:కేటీఆర్ హెచ్చరిక

హైదరాబాద్,మార్చి 11 (విశ్వం న్యూస్):బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఇళ్లను కూల్చినవారే మళ్లీ అదే చోట ఇందిరమ్మ ఇళ్లు కడతామని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది హంతకులే వెళ్లి సంతాపం తెలిపినట్టే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ముందుగా ఇళ్లను కూల్చి, తర్వాత పట్టాలు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేసే రాజకీయమని కేటీఆర్ అన్నారు. అంతేకాదు, ఆ పట్టాలు కూడా అందరికీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఆగమేగల మీద పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు. ప్రజల సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూల్చిన ప్రతి ఇంటికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.