మెట్రో డీల్ వెనుక చీకటి ఒప్పందాలు..? ₹30 వేల కోట్ల కుంభకోణం అంటూ శ్రవణ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్, జూన్ 15 (విశ్వం న్యూస్) : మెట్రో రైలు కొనుగోలు వ్యవహారంలో ₹30 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్&టీ మెట్రో ఆస్తుల కొనుగోలు వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టు అప్పులను ప్రజలపై మోపారని విమర్శించారు.

మెట్రో ఆలస్యానికి కేసీఆర్ కారణమని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో ఫేజ్-1ను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.
మెట్రో ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి దెబ్బతింటోందని శ్రవణ్ ఆరోపించారు.