హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సుకు మంటలు

హైదరాబాద్, జూన్ 21 (విశ్వం న్యూస్)-కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైంది. అలుగునూరు సమీపంలోని కాకతీయ కాలువ వద్ద షార్ట్సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపి, డోర్లు, ఎమర్జెన్సీ గేట్లు తెరిచి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించారు.
అనంతరం బస్సులోని అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంటలు వేగంగా వ్యాపించి కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.