వేలాదిమంది కన్నీటి వీడ్కోలు.. పెద్ది సుదర్శన్ రెడ్డికి అపూర్వ నివాళి

వేలాదిమంది కన్నీటి వీడ్కోలు.. పెద్ది సుదర్శన్ రెడ్డికి అపూర్వ నివాళి

  • జీవితమంతా పోరాటమే.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: సీహెచ్ శ్రీనివాస్

మహబూబాబాద్, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి వేలాదిమంది ప్రజలు కన్నీటి నివాళులు అర్పించడం ఆయన ప్రజాసేవకు, ఉద్యమస్ఫూర్తికి లభించిన అపూర్వ గౌరవమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విడుదల చేసిన సంతాప సందేశంలో, నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తుది వీడ్కోలు పలకడం ఆయన ప్రజలతో ఏర్పరుచుకున్న ఆత్మీయ బంధానికి నిదర్శనమని అన్నారు.

జీవితం అంతా పోరాటమే

పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితమంతా ప్రజల కోసం, తెలంగాణ కోసం సాగిన పోరాటమని, చివరి క్షణం వరకు మృత్యువుతో కూడా ధైర్యంగా పోరాడారని శ్రీనివాస్ పేర్కొన్నారు. గుండె ఆగిపోయిన అనంతరం కొంతసేపు తిరిగి స్పందించిన ఘటన అందరిలో ఆశలు రేకెత్తించినప్పటికీ, చివరికి ఆయన మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని తెలిపారు.

దశాబ్దాల అనుబంధం

తనకు పెద్ది సుదర్శన్ రెడ్డితో దశాబ్దాల అనుబంధం ఉందని, వరంగల్‌లో తొలిసారి పరిచయమైనప్పటి నుంచి చివరిసారి కలిసే వరకు ఆయన అదే ఆప్యాయతతో పలకరించేవారని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కలిసే సందర్భాలు తగ్గినా స్నేహబంధం మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరలేదని తెలిపారు.

ప్రజల హృదయాల్లో చిరస్థాయి

భౌతికంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోయినా, ఆయన ఆశయాలు, సేవలు, ఉద్యమస్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. వేలాదిమంది అభిమానాన్ని సంపాదించిన ఆయన నిజమైన ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *