
హైదరాబాద్, డిసెంబర్ 25 (విశ్వం న్యూస్) : రేవతి కుటుంబ బాధ్యత కోసం చర్యలు తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీతేజ్ భవిష్యత్ కోసం ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. మొత్తంగా శ్రీతేజ్ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఇందులో అల్లు అర్జున్ రూ.1 కోటి.. డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు.. మైత్రీ మూవీస్ సంస్థ రూ.50 లక్షలు.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ -ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజుకు అందించినట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెప్పిన అల్లు అర్జున్.. కళ్లు తెరుస్తున్నాడని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఇప్పటికే అల్లు అర్జున్ సహా పుష్ప-2 సినిమా బృందం ప్రకటించింది.
- కాగా ఈ ఘటనకి సంబంధించి ఓ షాకింగ్ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ రాకకి ముందే అస్వస్థతకి లోనయిన రేవతిని బయటకి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఆమెని థియేటర్ బయటకి తీసుకెళ్తున్న సమయం సుమారు 9 గంటల 16 నిముషాలు అయితే అల్లు అర్జున్ అక్కడికి వచ్చింది 9 గంటల 40 నిమిషాలకు అని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోల కారణంగా ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొందరు ఇది నిజమని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం సదరు ఫుటేజ్ని ఎడిట్ చేశారని అంటున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.