మద్యం దుకాణాల దరఖాస్తులు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

మద్యం దుకాణాల దరఖాస్తులు
పారదర్శకంగా జరిగేలా చర్యలు
చేపట్టాలి:మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్ గా ఏర్పడినా, ఎవరైనా దరఖాస్తులు సమర్పించుకుండా అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

హైదరాబాద్, ఆగస్టు 13 (విశ్వం న్యూస్) : మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో సిండికేట్ లు ఏర్పడకుండా మద్యం దుకాణాల కేటాయింపునకై ధరఖాస్తులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణాని కైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసామని దాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్ గా ఏర్పడిన, ఎవరైనా దరఖాస్తులు సమర్పించకుండా అడ్డంకులు సృష్టించే వారిపై, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అదేశించారు.

గౌడ, SC, ST లకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తుకు కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్ లేకపోతే సెల్ఫ్ అఫిడవిట్ లను అంగీకరించాలని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాల దరఖాస్తు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్న, దరఖాస్తుదారులకు సమాచారం కావాలన్నా వెంటనే స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523 ను సంప్రదించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సూచించారు. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ జిల్లాలో రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫార్మా, వస్త్ర తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ని వివరించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *