
హైదరాబాద్, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు పేర్లను తుది నిర్ణయించింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్లీ సిఫారసు చేయాలన్న అవసరం రావడంతో కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం అలాగే క్రికెట్ దిగ్గజం, మాజీ భారత జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లను కేబినెట్ గవర్నర్కు సిఫారసు చేసింది. గతంలో ప్రభుత్వం ఈ రెండు పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సూచించినప్పటికీ, ఆమోదం ఆలస్యం కావడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుతో కేబినెట్ మరోసారి ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది.
ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటాల నుంచి ప్రస్తుత రాజకీయ వాతావరణం వరకు కోదండరాం పాత్ర ప్రస్తావనలోకి రావడం, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ పేరును ప్రభుత్వం మరోసారి పట్టుబట్టడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వారి నియామకానికి తుది ఆమోదం త్వరలో వెలువడనుంది.