
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విశ్వం న్యూస్): గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలు, లోపాలపై హైకోర్టు తీర్పును గౌరవించకుండా విద్యార్థులపై కేసులు పెట్టడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో విద్యార్థులు శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా, పోలీసు నిర్బంధం జరగడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. “ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేక అనుముల వారి రాజ్యాంగమా? హైకోర్టు తీర్పు అమలు చేయమని అడగడం నేరమా?” అని ప్రశ్నించారు.
విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కాపాడాలంటే తప్పనిసరిగా జ్యూడీషియల్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. పరీక్షలో జరిగిన లోపాలు, రీవాల్యుయేషన్ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం అన్నింటినీ వెలుగులోకి తేవాలని స్పష్టం చేశారు.
- బీఆర్ఎస్ డిమాండ్లు:
- విద్యార్థులు, నిరుద్యోగులపై పెట్టిన పోలీసు కేసులు తక్షణమే ఎత్తివేయాలి.
- హైకోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేయాలి.
- పరీక్షలో జరిగిన అన్ని లోపాలపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యూడీషియల్ ఎంక్వైరీ జరగాలి.
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలి.
- కేసులు ఎత్తివేయకపోతే, విచారణ ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడుతుందని ఎమ్మెల్సీ శ్రవణ్ హెచ్చరించారు.