హీరాబెన్ కన్నుమూత… ప్రధాని మోదీకి మాతృవియోగం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. హుటాహుటిన ఢిల్లీ నుంచి గుజరాత్ చేరుకున్నారు. గాంధీనగర్లో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. తల్లి అంతిమయాత్రలో తల్లి పాడెమోను మోశారు ప్రధాని మోదీ. చాలా నిరాడంబరంగా హీరాబెన్ అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ‘నిండు నూరేండ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుని చెంతకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు.