దళిత బంధు పథకం అమలులో
టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

వీణవంక, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో దళితులకు పైలెట్ ప్రాజెక్టు కింద దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలం అయిందని వీణవంక మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఈదునూరి పైడి కుమార్ అన్నారు.
మొదటి విడత మంజూరులో అనేక కష్టాలకు ఓర్చిన దళితులు రెండో విడత అమలులో పూర్తిగా నిరాశకు గురవుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూ నానా బాధలు పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు.
దళితుల చెప్పులు అరిగే విధంగా తిరిగిన పథకం అమలు కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు తక్షణమే దళిత బందు అమలు చేయాలి. లేనిపక్షంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పైడి కుమార్ ప్రభుత్వాన్నిహెచ్చరించారు.