మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత
మల్లా రాజిరెడ్డి కన్నుమూత

  • ఆయన మృతిని ధ్రువీకరించిన చత్తీస్‌గఢ్‌ పోలీసులు

కరీంనగర్‌, ఆగస్టు 18 (విశ్వం న్యూస్) : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ దండకారణ్యంలో చనిపోయారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరియా ఉసూరు బ్లాక్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన రిలీజ్ చేసింది. రాజిరెడ్డి మృతిని చత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు.

మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మావోయిజానికి ఆకర్షితుడైన రాజిరెడ్డి తొలుత ఆర్‌ఎస్‌యులో పనిచేశారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ విస్తరణకు కృషి చేసి.. మంథని, మహదేవ్‌పూర్‌ ఏరియా దళంలో పని చేసి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1977లో ఆయనను ప్రస్తుత జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1996-97లో ఆయనను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకొంది. రాజిరెడ్డిపై అనేక పోలీసు కేసులు ఉన్నాయి.

1986లో పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పోలీస్​స్టేషన్​పై దాడి జరిపి ఒక ఎస్‌ఐ, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులోను నిందితునిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌పై మెరుపుదాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 2007 డిసెంబరులో కేరళలోని అంగన్‌మలైలో పోలీసులు పట్టుకున్నారు. అక్కడ నిషేధం లేకపోవడంతో రాజిరెడ్డిని వదిలేద్దామనుకుంటున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే 21 కేసులుండగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కోర్టులో డిసెంబరు 18న మంథని కోర్టులో డిసెంబరు 22న హాజరు పరిచారు.

14 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు నెలల అనంతరం జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించిట్లు ప్రచారం జరుగుతుండగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధృవీకరించారు. రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై రూ. 25లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మల్లారెడ్డి తన కూతురు స్నేహలత నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రీలత ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు.

ఆ తర్వాత తమతో సంబంధాలు లేకుండా పోయాయని సోదరుడు భీమారెడ్డి తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా పని చేశారు. మల్లా రాజిరెడ్డి 2008 జనవరిలో కేరళ అంగన్‌మళైలో అరెస్ట్ కాగా.. అప్పటి పెద్దపల్లి సీఐ హబీబ్ ఖాన్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకొచ్చి కరీంనగర్ రూరల్ ఠాణాలో నమోదైన క్రైం నెంబర్ 1/2008 కుట్ర కేసులో మెట్​పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి కరీంనగర్ జైలుకు తరలించారు. అప్పటికే జన్నారం మండలం తపాపూర్​లో నలుగురి హత్య సహా కమాన్ పూర్, మంథని, పెద్దపల్లి ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు ఉండటంతో రెండున్న సవంతర్సరాలు జైలులో ఉన్నారు.

విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి అయిదు రాష్ట్రాల ( నార్త్, ఈస్ట్) ఇంచార్జ్​గా వ్యవహరించారు. కొండపల్లి సీతారామయ్య, గణపతిలపై నమోదైన అన్ని కేసుల్లో రాజిరెడ్డి పేరుంది. మల్లారెడ్డి సోదరుడు భీమారెడ్డి.. అన్న రాజిరెడ్డి చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల తెలుసుకున్నామన్నారు. అతని మరణాన్ని ధ్రువీకరించి మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *