సీపీఎస్ రద్దు చేయాలి
సీపీఎస్ రద్దు చేయాలి

సీపీఎస్ రద్దు చేయాలి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులకు ఆయన లేఖ రాశారు.
గత ఎన్నికల సందర్భంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు, జీపీఎఫ్కు సంబంధించిన పెండింగ్ బిల్లులతో పాటు ఇతర బకాయిలను వెంటనే మంజూరు చేసి ఉద్యోగులకు అందించాలని కోరారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల కోసం మెడికల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెల ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆరోగ్య పథకం కోసం నిధులు జమ అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు పథకం అమలు కాకపోవడం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకుని ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు.