ఫేక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు
ఫేక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు

హైదరాబాద్, సెప్టెంబర్ 9: శాసనసభలో ధ్రువీకరించని సోషల్ మీడియా పోస్టులను ప్రదర్శించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభా గౌరవాన్ని దిగజార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. అక్కసు ఎక్కువ.. ఆలోచన తక్కువ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షంపై రాజకీయ కక్షతోనే ఫేక్ పోస్టులను సభలో ప్రస్తావించారని ఆరోపించారు.

అసెంబ్లీ రికార్డులకు చట్టబద్ధమైన ప్రాధాన్యత ఉంటుందని, ధ్రువీకరించని సోషల్ మీడియా స్క్రీన్షాట్లను సభలో ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని శ్రవణ్ పేర్కొన్నారు. నిజంగా ఆ పోస్టులు ఎవరు సృష్టించారో సైబర్ క్రైమ్ ద్వారా విచారణ చేయించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వారి దృష్టిని మళ్లించేందుకే ఫేక్ పోస్టుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా రాజకీయ ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
రేవంత్రెడ్డి ఇకనైనా ఫేక్ రాజకీయాలకు స్వస్తి పలికి, శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు సభకు, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.