విధి నిర్వహణలోనే విషాదం..
డీటీవో వెంకన్న మృతి

భూపాలపల్లి, 22 (విశ్వం న్యూస్)- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా రవాణా అధికారి (డీటీవో) వెంకన్న విధి నిర్వహణలో ఉండగానే బొగ్గు లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా రవాణా కార్యాలయం ముందు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆయనపైకి దూసుకెళ్లింది. నడుము భాగంపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన వెంకన్న ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
2012 బ్యాచ్కు చెందిన వెంకన్న ఇటీవలే బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. విధి నిర్వహణలోనే ఆయన మృతి చెందడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.