విద్యార్థుల మనోవికాసానికి
కళలు దోహదపడతాయి

- విద్యార్థుల మనోవికాసానికి కళలు దోహదపడతాయి
- పుస్తకాలు, సంగీతం, క్రీడాలు కార్యకలాపాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి: జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : విద్యార్థుల మనోవికాసానికి కళలు దోహదపడతాయని, విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు విద్యార్థి సర్వాంగీణ వికాసం జరిగినప్పుడే విద్యా లక్ష్యం నెరవేరుతుందని జిల్లాకలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన స్వరమాధురి సమాపనోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల మనోవికాసానికి కళలు దోహదపడతాయని, విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు విద్యార్థి సర్వాంగీణ వికాసం జరిగినప్పుడే విద్యా లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.
ప్రతి వ్యక్తులు మూడు రకాల కళలు వ్యక్తిత్వ వికాసంలో భాగమవుతాయని వాటిలో ముఖ్యంగా సంగీతము, నాటకము, కవిత్వం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయని మనలో దాగి ఉన్నటువంటి ఈ లలిత కళలను వెలికి తీసినప్పుడే వ్యక్తి ఉన్నతుడుగా తీర్చిదిద్దబడుతాడని ఆయన అన్నారు. పుస్తకం, సంగీతం, క్రీడలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వరమాధురి అనే పేరుతో అంతర్జాల వేదికగా ప్రతి ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు కెబి శర్మ సంగీత పాఠాలు నేర్పించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కె.బి.శర్మ ను కలెక్టర్ అభినందించారు.

అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇవ్వడం దీనికి తెలంగాణలోనే ప్రప్రథమంగా కరీంనగర్ వేదిక కావడం శుభ పరిణామం అన్నారు.పిల్లలకు సరైన సందర్భంలో సరైన జ్ఞానాన్ని , విద్యను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, అందనంత ఎత్తుకు ఎదుగుతారని, పిల్లల్లో ఉన్న ఈ సృజనను బయటకు తీసుకు రావడానికి జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కేవలం 15 వారాల కాలంలోనే 35 మంది విద్యార్థులు దేశభక్తి, దైవభక్తి గీతాలను ఆలపించడం చాలా గొప్ప విషయమని అయన పేర్కొన్నారు. ఆన్లైన్లో నేర్చుకోవడానికి జూమ్ వేదికను అందించి నిరాఘాటంగా కార్యక్రమం కొనసాగడానికి సహకరించిన ఉపాధ్యాయుడు జంగ మనోహర్ రెడ్డిని అభినందించారు.
ఈ సందర్భంగా సంగీతం నేర్పిన ప్రముఖ సంగీత విద్వాంసులు కేబి శర్మను, సహకారం అందించిన జంగ మనోహర్ రెడ్డిని కలెక్టర్ ఘనంగా సన్మానించారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సంగీతకార్లు దాదాపు 200 మంది పైగా పాల్గొన్నరు.

ఈ కార్యక్రమంలో అవధాని, సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు,జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి మారం స్వదేశీకుమార్, జిల్లా విద్యాధికారి సిహెచ్ జనార్దన్ రావు, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి కె.అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్ రెడ్డి, గాజుల రవీందర్ జంగా మనోహర్ రెడ్డి నంది శ్రీనివాస్,
కెఎస్.అనంతాచార్య, డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.