తెలంగాణపై దాడి, పేదలపై నిర్లక్ష్యం-దాసోజు శ్రవణ్ ఘాటుగా స్పందన

  • కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ — తెలంగాణను అవమానపరిచే బీజేపీ-టీడీపీ కుట్రలపై దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందన

హైదరాబాద్, జూలై 10 (విశ్వం న్యూస్): తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు రాష్ట్రంలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ధ్వజమెత్తారు. కల్తీ కల్లు సేవించి ఏడుగురు నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర పాలనలో ఘోర వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

పేదల ప్రాణాలకు విలువలేని ప్రభుత్వం: ఈ విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడాన్ని ఖండించిన శ్రవణ్, హోంమంత్రిత్వ శాఖను స్వయంగా నిర్వర్తిస్తున్న ఆయన మౌనం బాధ్యతారాహిత్యానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. పేదల విషయంలో ప్రభుత్వం చూపుతున్న చులకన ధోరణి ప్రజాస్వామ్యానికి మచ్చుతునక అని అన్నారు.

  • బీఆర్ఎస్ డిమాండ్లు:
  • మృతుల కుటుంబాలకు తక్షణ ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
  • కల్తీ కల్లు వ్యాపారంపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
  • ఇందులో పాలుపంచుకున్న రాజకీయ నాయకులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి
  • భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
  • తెలంగాణను మ్యాప్ నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించిన శ్రవణ్
  • ఒడిశాలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన మ్యాప్‌లో తెలంగాణను చూపకపోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇది ఫెడరల్‌ వ్యవస్థపై దాడి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే కుట్రగా అభివర్ణించారు.

తెలంగాణ లేని మ్యాప్ –ఇది కేవలం పొరపాటు కాదు, ఉద్దేశపూర్వక దాడి
ప్రముఖ బీజేపీ నేత మాధవ్, టీడీపీ నేత లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణను మాపింగ్‌లో ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపిస్తూ, ఇది బీజేపీ-టీడీపీ అసలైన ముఖచిత్రాన్ని బయటపెడుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో చంద్రబాబునాయుడు, బీజేపీ తీసుకున్న వైఖరి ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు.

  • బీఆర్ఎస్ డిమాండ్లు:
  • తెలంగాణను లేకుండా మాపింగ్‌ను విడుదల చేసిన బాధ్యులపై కేసు నమోదు చేయాలి
  • బీజేపీ నేత బండి సంజయ్ స్పందించాలి
  • బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • తెలంగాణ ఉనికిని అసాధ్యంగా చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి

“తెలంగాణ గౌరవాన్ని కించపరిచే ఎటువంటి ప్రయత్నానికీ బీఆర్ఎస్ క్షమించదు” అని స్పష్టం చేసిన దాసోజు శ్రవణ్ గారు, తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గజ్జెల నాగేశ్, రామచంద్ర నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *