కృష్ణశిలల్లో కేసీఆర్ దూరదృష్టి.. యాదాద్రి మహిమ వెలుగులో

- యాదాద్రి గిరిప్రదక్షిణం – భక్తి, భావన, భవిష్యత్కు సందేశం
యాదాద్రి 2 (విశ్వం న్యూస్):యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.. అనుభవం. భాగ్యనగరానికి సమీపంలో వెలసిన ఈ ప్రాచీన నారసింహుని దివ్యక్షేత్రం సంవత్సరం పొడవునా భక్తజనాలతో కళకళలాడుతూ ఉంటుంది. తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన యాదాద్రి, భక్తి–భావనల సమ్మేళనంగా ప్రతి యాత్రికుడి మనసును హత్తుకుంటుంది.

ఈ యాత్రా స్థలాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (బాపు కేసీఆర్) గారి కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కృష్ణశిలలతో తీర్చిదిద్దిన ఆలయ నిర్మాణాలను పరిశీలిస్తే ఆయన దూరదృష్టి, భక్తి ప్రపత్తులు, పరిణతి చెందిన ఆలోచనా విధానం స్పష్టంగా ప్రతిఫలిస్తాయి.

“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో..” అని మహాకవి సి. నారాయణ రెడ్డి (సినారె) వర్ణించిన భావం యాదాద్రి శిల్పకళలో సాక్షాత్కారమవుతుంది. యాత్రికుల సౌకర్యాలతో పాటు పరిసరాల అందాన్ని పెంపొందించే లక్ష్యం ప్రతి నిర్మాణంలో ప్రతిబింబిస్తుంది.

అయితే, గతంలో కనిపించిన పరిపాలనా దక్షత, ప్రజోపయోగకర ప్రణాళికలు ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మసకబారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అస్తవ్యస్త విధానాలు, అనుభవ రాహిత్యం, దుందుడుకు పోకడలు అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశయాలు, లక్ష్యసాధనకు కావాల్సిన స్థిరత్వం, సంయమనం అవసరం అనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ పదేళ్లలో సాధించిన సర్వతోముఖాభివృద్ధి అల్పబుద్ధి, అజ్ఞానానికి బలి కాకూడదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఆ చరిత్రకు మకిలి పట్టించే ప్రయత్నాలు ఫలించకూడదని ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతోంది.
ఈ సదుద్దేశంతో యాదాద్రి నాధుని దర్శించి ప్రార్థించిన మహిళల భక్తి, సంకల్పం శతధా, సహస్రధా ప్రశంసనీయం. వారి ప్రార్థనలు రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ…
శుభం భూయాత్.
