మెడికల్ విద్యార్థిని
ప్రియాంక మృతి

- కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. కుటుంబంలో విషాదం
హైదరాబాద్, ఆగస్టు 9 (విశ్వం న్యూస్) : రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ వద్ద ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి దుష్యంత్, ఆండ్రూ అనే యువకులపై ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాదం అనంతరం తీవ్ర గాయాలతో ప్రియాంకను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచారు.
ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.