మే 3వ తేదీన జరిగిన NEET 2026 పరీక్ష రద్దు..

- పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా కలకలం
హైదరాబాద్, మే 12 (విశ్వం న్యూస్):దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే NEET-2026 పరీక్షపై వివాదం చెలరేగింది. మే 3వ తేదీన నిర్వహించిన NEET పరీక్షను రాజస్థాన్లో జరిగిన ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం కారణంగా రద్దు చేసినట్లు సమాచారం వెలువడింది.
రాజస్థాన్లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరీక్షకు 48 గంటల ముందే విద్యార్థులకు అందించిన ప్రాక్టీస్ పేపర్లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంలో ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. దీంతో పరీక్ష పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తదుపరి మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం ఎలాంటి అదనపు ఫీజు లేకుండా మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.