పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమంటారా? : – బిఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజం

  • రైతుల నోట్లో మన్ను కొట్టి.. రక్త చరిత్ర రాయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి రక్కసి పాలన! పంటలకు నీళ్లు అడిగితే.. ఒంటి రక్తం చల్లి పండించుకోమంటావా? ముఖ్యమంత్రివా లేక రక్త దాహం మరిగిన మృగానివా? – బిఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజం

హైదరాబాద్, జూలై 12 (విశ్వం న్యూస్): రాష్ట్రంలో సాగునీటి సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. దేశానికి అన్నం పండించే రైతుల పట్ల ముఖ్యమంత్రి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంటలకు నీళ్లు అడిగితే “ఒంటి రక్తం చల్లి పండించుకోండి” అనే తరహాలో మాట్లాడడం రైతులను అవమానించడమేనని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి భాష ఇదేనా? : స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రైతులపై ఇంత క్రూరమైన భాష ఉపయోగించలేదని శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ప్రశ్నించారు. రైతుల పట్ల కనీస మానవత్వం, సభ్యత లేకుండా మాట్లాడటం బాధాకరమన్నారు.

రేవంత్‌కు శ్రవణ్ ప్రశ్నలు : రేవంత్ రెడ్డిని ఉద్దేశించి శ్రవణ్ దాసోజు పలు ప్రశ్నలు సంధించారు. “నువ్వు ముఖ్యమంత్రివా? లేక రక్తదాహం మరిగిన మృగానివా?”, “పంట పొలాలకు నీళ్లు అడిగితే రైతులు రక్తం చల్లుకోవాలా?” అంటూ నిలదీశారు. రైతుల జీవితాలతో చెలగాటమాడే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం నీళ్లపై ఆరోపణలు : కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పంపులు ఆన్ చేయకుండా సాగుభూములను కావాలనే ఎండబెడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రైతుల బాధలను వెటకారంగా తీసుకుంటోందని విమర్శించారు.

రైతాంగం గుణపాఠం చెబుతుంది : రైతు కన్నీటి వల్ల ఎన్నో పాలకుల సామ్రాజ్యాలు కూలిపోయాయని, అదే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికీ ఎదురవుతుందని శ్రవణ్ హెచ్చరించారు. రైతాంగాన్ని అవమానించే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ప్రజల కోర్టులో తగిన తీర్పు తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం ఈ వైఖరికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *