అధికార మదంతో విర్రవీగొద్దు: పొంగులేటికి శ్రవణ్ దాసోజు హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 30 (విశ్వం న్యూస్): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార అహంకారానికి, సంస్కారహీనతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాలాకోరుతనాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
పొంగులేటి శారీరక వైకల్యాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం అత్యంత అభ్యంతరకరమని, మంత్రి హోదాకు తగని భాషలో బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని శ్రవణ్ దాసోజు అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు ఒక్క పేద కుటుంబానికైనా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాలు శాశ్వతం కావని, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.