బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్ పై నేడు విచారణ

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. వరంగల్‌ కమిషనరేట్‌ కమలాపూర్‌లో జరిగిన లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సాప్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారని ఆరోపించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లో సంజయ్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి బుధవారం సాయంత్రం జడ్జి ఎదుట హాజరు పరిచేవరకు అడుగడుగునా ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బుధవారం రోజున కోర్టుకు సెలవు కావడంతో పోలీసులు సంజయ్‌ను సాయంత్రం సుమారు 6 గంటల 50 నిమిషాలకు హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. పూర్వాపరాలను పరిశీలించాక.. సంజయ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పోలీసులు సంజయ్‌ను కరీంనగర్‌ కారాగారానికి తరలించారు. జడ్జి ఎదుట సంజయ్‌ను హాజరుపరిచిన సందర్భంగా.. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి కట్టుదిట్టంగా వ్యవహరించారు. పోలీసులు మిమ్మల్ని కొట్టారా? అని న్యాయమూర్తి అడగ్గా.. సంజయ్‌ తన చొక్కా తీసి ఏసీపీ, సీఐలు కొట్టారంటూ గాయాలను చూపించినట్లు తెలుస్తోంది. తనను అకారణంగా అరెస్టు చేశారని, కారణాలను కూడా వెల్లడించకుండా రోజంతా అనేక ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్ర గందరగోళాన్ని సృష్టించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్‌పై మోపిన నేరారోపణలన్నీ ఏడేళ్ల లోపు శిక్షగలవేనని, ఆయనను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు కోరారు.

విచారణ వాయిదా..: తర్వాత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని, సంజయ్‌ బయటకెళితే విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని బెయిల్‌ ఇవ్వవద్దని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి.. గంట తర్వాత సంజయ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆయనతో పాటు బూర ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, మౌటం శివగణేశ్‌లను జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం సంజయ్‌ దరఖాస్తు చేసుకోగా, పోలీసులు తమ వివరణ కోసం గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది.

ఖైదీ నంబరు 7917 : ప్రభుత్వం నుంచి తనకు ప్రాణాపాయం పొంచి ఉందని, ఆహారంలో విష ప్రయోగం జరిగే ప్రమాదం ఉందని, భద్రతాపరంగా తనను కరీంనగర్‌ జైలుకే పంపాలని సంజయ్‌ జడ్జికి విన్నవించుకున్నారు. ఈ మేరకు జైలులో ఆహారాన్ని ముందుగా తనిఖీ చేశాకే ఇవ్వాలని జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. బండి సంజయ్‌ను బుధవారం రాత్రి 10 గంటల 5 నిమిషాలకు కరీంనగర్‌ జిల్లా కారాగారంలోకి పంపించగా.. రిమాండ్‌ ఖైదీ నంబరు 7917ను కేటాయించారు. ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారక్‌ను కేటాయించారు.

సంజయ్‌ భార్య అపర్ణతో పాటు కుమారులు భగీరథ్, సుముఖ్‌.. ఆయన రాక కోసం కారాగారం సమీపంలోని రోడ్డు పక్కన నిరీక్షించారు. సంజయ్‌ని వాహనంలో నేరుగా జైల్లోకి తీసుకెళ్లడంతో వారు ఆయనను కలిసే అవకాశం దక్కలేదు. బండి సంజయ్‌ దాఖలు చేసిన బెయిల్‌ దరఖాస్తుపై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. మరోవైపు పోలీసులు.. ఆయనను కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *