పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన
డిమాండ్లను నెరవేర్చాలి
భూక్యా సారయ్య జూనియర్ పంచాయతీ
కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
గోవిందరావుపేట, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ములుగు జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్యాసారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సారయ్య హాజరై మాట్లాడుతూ. వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ నినాదంతో నిరవధిక సమ్మెను మొదలుపెట్టినట్లు తెలిపారు.
గత నాలుగు సంవత్సరాల పని పీరియడ్ కూడా సర్వీస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ పంచాయతీ అవార్డులు రావడంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర అన్న విషయాన్ని విస్మరించరాదని అన్నారు. పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి నిరంతరం పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండలం అధ్యక్షులు పోలేపల్లి అశోక్ ,ఉపాధ్యక్షులు సిహెచ్ భారతి ,కార్యదర్సులు ఎం స్వాతి, ఏ రోజా, ఎం రజిత, బి లలిత, జి శ్రీతేజ, ఎం ఆమని, ఎండి సాజియా, ఎండి ఉస్మాన్, కే క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
