జూన్ 2లోపు పీఆర్సీ నివేదిక సమర్పించాలి: ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, మే 30 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర రెండో పీఆర్సీ (వేతన సవరణ కమిటీ) నివేదికను జూన్ 2లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్ను కోరారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలు, డిమాండ్లు, వేతన సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే పీఆర్సీ కమిషన్కు సమర్పించాయని ఆయన తెలిపారు. నివేదిక పూర్తయినప్పటికీ దానిని ఇంకా ప్రభుత్వానికి అందించకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నివేదికను వెంటనే ముఖ్యమంత్రికి అందజేస్తే, దాని ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, ఇతర ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలను పీఆర్సీ దృష్టికి తీసుకెళ్లేందుకు తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని ముజాహిద్ హుస్సేన్ చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.