కుంట్లూరులో హైడ్రా చర్యలపై ఉద్రిక్తత

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతల కోసం హైడ్రా అధికారులు బుల్డోజర్లతో చేరుకోవడంతో కాలనీ వాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అధికారులు ముందుకు సాగకుండా నివాసితులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైడ్రా అధికారులు ఎలాగైనా కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేయగా, కాలనీ వాసులు తమ ఇళ్లను కూల్చివేయవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గత రెండు గంటలుగా ఈ హైడ్రామా కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గేటెడ్ కమ్యూనిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్చలు జరుపుతున్నారు.