తెలంగాణ జల హక్కులకు భంగం కలిగితే జల ఉద్యమం : కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ నదీ జలాల హక్కులకు భంగం కలిగితే మరోసారి జల ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. నదీ జలాల హక్కులకన్నా ముఖ్యమైనది తమ పార్టీకి మరేమీ లేదని స్పష్టం చేశారు. నంది నగర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. వచ్చే వారం జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాను ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను అంగీకరించి ప్రభుత్వం సమావేశానికి ఎలా హాజరవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ జల హక్కులను ఎలా కాపాడతారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. నదీ జలాల విషయంలో కేంద్రం లేదా రాష్ట్రం నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగితే తెలంగాణ ఉద్యమ స్థాయిలో మరో ఆందోళన వస్తుందని పేర్కొన్నారు.
పక్క రాష్ట్రం నదుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. పాలమూరు ప్రాంతానికి నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదని అన్నారు.
హైడ్రా విషయంలోనూ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టుల వ్యాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు విరుద్ధమని ఆరోపించారు. పేదల భూములను సేకరించి పెద్దలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది ఇళ్లను కూల్చివేసిందని ఆరోపించారు.
ఇక హిల్ట్ పాలసీపై కూడా కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని పారిశ్రామిక భూముల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని తెలిపారు. ఈ పాలసీ ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.
హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ, ప్రజల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. హిల్ట్ పాలసీ, 22ఏ నిషేధిత జాబితా, భూవ్యవహారాలపై ప్రజల ముందు వాస్తవాలను ఉంచుతామని చెప్పారు. ఈ అంశాలపై అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.