డిజిటల్ సభ్యత్వానికి బీఆర్ఎస్ శ్రీకారం
119 నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం

హైదరాబాద్, మే 21 (విశ్వం న్యూస్): K. Chandrashekar Rao నేతృత్వంలోని Bharat Rashtra Samithi పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో చేపట్టేందుకు కసరత్తులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రత్యేక ఇంచార్జీలను ప్రకటించిన పార్టీ అధిష్టానం, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ఐటీ నిపుణుడిని కూడా నియమించింది.
ఈ ఇంచార్జీలకు, ఐటీ ప్రతినిధులకు హైదరాబాద్లోని Telangana Bhavan లో ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ రూపుదిద్దుకుంటుండగా, త్వరలోనే తుది రూపం దాల్చనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ భవన్లో శిక్షణ పూర్తయిన అనంతరం జిల్లా కేంద్రాల్లో విస్తృత స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కమిటీ నియమించిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జీల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ప్రతి నియోజకవర్గంలో ఉన్న బూత్ల సంఖ్య ఆధారంగా ఒక్కో బూత్కు ఇద్దరు చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి, వారానికి పైగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు హాజరయ్యే కార్యకర్తలకు భోజన వసతులు కూడా కల్పించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలంతా స్వయంగా సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమోత్సాహాన్ని నింపనున్నారు.

పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, నిర్ణీత గడువులో కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.