రీల్ కాదు..!! రియల్..!!!

- మంగళంలో ఎర్రచందనం గొడౌన్ల తనిఖీ చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుపతి, నవంబర్ 8-(విశ్వం న్యూస్) : సినిమాల్లో కాదు… నిజజీవితంలోనూ పవన్ యాక్షన్!’ — ఇదే నినాదంగా మారింది ఈ రోజు తిరుపతి జిల్లాలో. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా మంగళం ప్రాంతంలోని ఎర్రచందనం అక్రమ రవాణా గొడౌన్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

అధికారులు, అటవీశాఖ సిబ్బందితో కలిసి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం మంగళం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అనుమానాస్పద గిడ్డంగులను తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంపలు, రవాణా వాహనాలు, నకిలీ పాస్లు గురించి ఆయన వివరాలు సేకరించారు.
“ఎర్రచందనం స్మగ్లింగ్పై రాజీ ఉండదు. ప్రభుత్వ ప్రతిష్టకూ, ప్రజల ఆస్తికీ భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు,” అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టి నినాదాలు చేశారు.

తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. “ప్రజలు అడవుల రక్షకులు కావాలి. ఎర్రచందనం అక్రమ రవాణా అంటే రాష్ట్ర ఆస్తి దోపిడీ. ఇది ఇక సహించం,” అని హెచ్చరించారు.
ఈ ఘటనతో మంగళం ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధికారులు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.