ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విశ్వం న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 30: అత్తాపూర్ రాజేంద్రనగర్ డివిజన్లోని లక్ష్మీనగర్ పార్కులో అత్తాపూర్ యోగా సెంటర్ వాకర్స్ అసోసియేషన్, లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఎండో పిక్స్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ వీచిక అన్నపురెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం శిబిరంలో పాల్గొని 150 మందికి పైగా స్థానికులు, వాకర్స్కు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించింది.
ఈ సందర్భంగా బీపీ, షుగర్, హెచ్బీఏ1సీ, రెటినోపతి, లిపిడ్ ప్రొఫైల్, న్యూరోపతి తదితర కీలక పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. కార్యక్రమానికి లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని డాక్టర్ ధర్మరక్షక్ అన్నారు. నిరంతర వైద్య పరీక్షలు, సకాలంలో వైద్యుల సూచనలు, ముందస్తు జాగ్రత్తలు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అత్తాపూర్ యోగా సెంటర్ గురువు పి. మహేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ పత్రికా రచయిత, కాలమిస్ట్ నేదునూరి కనకయ్య మాట్లాడుతూ వ్యక్తి ఆరోగ్యం అతను అవలంబించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పోషకాహారం, వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఉండ్రా నరసింహారావు మార్గదర్శకత్వంలో, యోగా గురువు పి. మహేందర్ సమన్వయంతో శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా సెంటర్ సభ్యులు బాలకృష్ణ, భుజంగారెడ్డి, బుచ్చయ్య, రవి, విజయ్, సాయి, విజయశ్రీ, అనురాధ, సమంత, ఎన్. సరిత, మధు, ప్రభాకర్, కుమార్రెడ్డి, మాజీ సైనికుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.