పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, ఆగస్టు 1 (వార్తా కథనం): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం)తో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
జూలై 26న హనుమకొండలో గుండెపోటుకు గురైన అనంతరం ఆయనను సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయనకు 52 సంవత్సరాలు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, వరంగల్ జిల్లా పార్టీ కన్వీనర్గా, జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన విశేష కృషి చేశారు.

నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన ఆయన, తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా గుర్తింపు పొందారు
ఇదిలా ఉండగా, యశోద ఆసుపత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి తరలించారు. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం నర్సంపేటకు తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం కొంతసేపు నర్సంపేటలో ఉంచి, అనంతరం ఆయన స్వగ్రామం నల్లబెల్లికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం ప్రకటించారు.