పదవీ విరమణ.. సంధ్యారాణికి భావోద్వేగ వీడ్కోలు

హైదరాబాద్, జూలై 29 (విశ్వం న్యూస్): ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న వాణిజ్య పన్నుల శాఖ ఇన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణికి కరీంనగర్లో ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు ఘన సన్మానం నిర్వహించి భావోద్వేగ వీడ్కోలు పలికారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు పదేళ్లపాటు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కరీంనగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ గోపాల్ అధ్యక్షత వహించగా, గోల్కొండ జాయింట్ కమిషనర్ రవి, మహబూబ్నగర్ జాయింట్ కమిషనర్ శ్రీలీల, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్లు కవిత, చరణ్, దేవేందర్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు జి. భిక్షపతి సహా పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ, కరీంనగర్ గడ్డను ఎవరూ మరువలేరని అన్నారు. జాయింట్ కమిషనర్ రవి మాట్లాడుతూ, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల పాత్ర కీలకమని, సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

కరీంనగర్ జాయింట్ కమిషనర్ గోపాల్ మాట్లాడుతూ, కరీంనగర్లో ఇంత ఆత్మీయతతో కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, సంధ్యారాణి కరీంనగర్లో పదేళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించి అందరి మన్ననలు పొందారని, ఆమె పదవీ విరమణకు ముందే అధికారులు, ఉద్యోగులు కలిసి ఘనంగా సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు.
సన్మానానికి స్పందించిన సంధ్యారాణి, తన ఉద్యోగ జీవితంలో కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఎప్పటికీ మరువనని, ఇక్కడి అధికారులు, ఉద్యోగులు తనకు అందించిన గౌరవం జీవితాంతం గుర్తుండిపోతుందని భావోద్వేగంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహమ్మద్ సలావుద్దీన్, విష్ణు, ఎన్.వి. రమేష్, శంకర్, మహమ్మద్ అబ్దుల్ బారి, కృష్ణవేణి, సునీత, అనిత, ఇలియాస్, ముప్పిడి శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, రాజేశ్వరరావు, నరేష్, శ్రీకాంత్, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.