రేవంత్ రెడ్డి నీకెందుకు
కడుపుమంట:శ్రవణ్

- రేవంత్ రెడ్డి వైఖరి ఎండగడుతూ డాక్టర్ దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధ్యక్షుడికి బహిరంగ లేఖ రాసారు
హైదరాబాద్, అక్టోబర్ 08 (విశ్వం న్యూస్) : “ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం పేద పిల్లలకు వరం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదు అనే సూత్రాన్ని నమ్మిన సీఎం కేసీఆర్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం అభినందించవలసిన విషయం. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తుంటారు. డ్యూటీలకు వెళ్తుంటారు. ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలు తినకుండా స్కూళ్లకు వస్తున్నారు. ఆకలైతే చదువు బుర్రకెక్కే అవకాశముండదు. ముందు కడుపునిండితేనే చదువు బుర్రకెక్కుతుంది. అందుకు విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన వెనక మానవీయ కోణం వుంటుంది. ప్రతి పథకం అమలుకు ముందు ఆయన సామాజిక కోణంతో ఆలోచిస్తారు. అందుకే అవి విజయవంతమవుతూ సామాజిక మార్పులకు కారణమవుతున్నాయి. అల్పాహార పథకం కూడా కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదు, పాఠశాలల్లో డ్రాపవుట్స్ తగ్గించి, బడి ఈడు పిల్లలందరినీ బడిబాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది,” అని సీఎం అల్పాహార పథకం ప్రాముఖ్యాన్ని డాక్టర్ దాసోజు శ్రవణ్ వివరించారు.
“దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ మాదిరి రాష్ట్ర స్థాయి అల్పాహార పథకం అమలు కావడం లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది కానుంది. ఈ రోజు ఈ పథకాన్ని రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ తరహా హై స్కూల్ విద్యార్థులకు ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో చెప్పాలి. ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ లేదా బీజేపీ పాలిట రాష్ట్రం లో కూడా ఈ తరహా పథకం అమలు కావడం లేదు. కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా ఇలాంటి పథకం లేదు. కానీ వీరు కూడా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు,” అని డాక్టర్ శ్రావణ్ అన్నారు.
“పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకు సూపర్ఫైన్ సన్న బియ్యాన్ని హాస్టళ్లకు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మారుతున్న కాలంతో వారి పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పిల్లలకు 175 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ బియ్యానికి పరిమితం చేయడం మంచిది అని భావించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పరిమాణంపై పరిమితిని తొలగించించింది,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్, కెసిఆర్ ప్రభుత్వం విద్యార్ధుల పట్ల చూపుతున్న శ్రద్దని కొనియాడారు.
“పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించడం కోసం అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద జనవరి 1, 2015 నుంచి ప్రభుత్వం పాలు, గుడ్లు, పోషకాహారాన్ని పంపిణి చేస్తోంది. మొత్తం 18,96,844 మంది పాలిచ్చే తల్లులు, 5,18,215 మంది శిశువులు మరియు 21,58,479 మంది గర్భిణులు ఈ పథకం కింద లబ్ది పొందారు. గత సంవత్సరంలో ఇందుకోసం రూ.627.96 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం కింద సరఫరా చేసే ఆహార పదార్థాల పరిమాణాన్ని అన్ని వర్గాలకు కూడా పెంచారు,” అని బిఆర్ఎస్ సీనియర్ నేత కొనసాగించారు.
“23 లక్షల కుటుంబాల సంతోషాన్ని భరించలేకపోతున్న మీ పార్టీకి ఘోరీ కట్టే రోజు త్వరలోనే వస్తుంది. పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్, వారి ఆనందాన్ని అడ్డుకోవాలని చూస్తున్న మీ పార్టీకి తద్దినం పెట్టె రోజులు త్వరలోనే వస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కు బ్రేకులు వేద్దామనుకుంటున్న మీ రాజకీయ కుటిల నీచమైన బుద్ధి కి, మీ రాక్షస ప్రవృత్తి ని పాతరేసి దీన జన బాంధవుడు, సకల జన సారధి కేసీఆర్ గారు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం,” అని శ్రవణ్, రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.