విజయశాంతి సహా కాంగ్రెస్
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ ప్రచార కమిటీ మాజీ ఛైర్మన్ విజయశాంతిలను అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వెల్లడించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొనడంతో పీసీసీ కోర్ కమిటీ, ఏఐసీసీ వడపోసి మూడు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఎమ్మెల్యే కోటా 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయని మొదటి నుంచి భావించినప్పటికీ మిత్రపక్షమైన సీపీఐ పొత్తులో భాగంగా తమకు ఒక స్థానం ఇవ్వాలని పీసీసీకి విజ్ఞప్తి చేయడంతో ఏఐసీసీకి నివేదించగా దీనిపై చర్చించిన తర్వాత మిత్రపక్షమైన సీపీఐకి పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని కేటాయించారు. మిగిలిన మూడు స్థానాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేతావత్ శంకర్ నాయక్, బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయశాంతిలను అభ్యర్థులుగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.