ఫీర్జాదిగూడ చెరువులో
దూకి ఆత్మహత్య!

హైదరాబాద్, జూలై 19 (విశ్వం న్యూస్): నగరంలోని ఫీర్జాదిగూడలో ఓ యువతి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అనంతరం చెరువులో మృతదేహంగా కనిపించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేది. కొంతకాలంగా ఉద్యోగానికి దూరంగా ఉంటూ తల్లి అరుణతో కలిసి ఫీర్జాదిగూడ శంకర్నగర్ కాలనీలో నివసిస్తోంది.
శనివారం తెల్లవారుజామున తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం తల్లి గమనించి స్థానికుల సహాయంతో కుమార్తె కోసం వెతకగా, ఫీర్జాదిగూడ చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యువతి కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, వాటిని షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. యువతి మృతికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.