పాలమూరులో
రేవంత్ పచ్చి
అబద్ధాలు

హైదరాబాద్, జూన్ 12 (విశ్వం న్యూస్) : బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన “నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి సమాజాన్ని నాశనం చేస్తుంది” అనే సూక్తిని గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర పూర్వ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీదేవి మంత్రి ముఖ్యమంత్రి Revanth Reddy వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పాలమూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అసత్యాలతో నిండిపోయాయని, రైతు సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టులు, పాలమూరు అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పాలమూరు జిల్లాకు గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనల వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని, కృష్ణా, తుంగభద్ర జలాల విషయంలో జిల్లా హక్కులు కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం అనంతరం K. Chandrashekar Rao నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా పాలమూరు రూపురేఖలు మారాయని అన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, తుమ్మిళ్ల లిఫ్ట్, కోయిల్ సాగర్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు జిల్లాలో సాగునీటి విస్తరణకు దోహదపడ్డాయని, ప్రస్తుతం వాటి ఫలితాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాస్తవాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పాలమూరు చరిత్ర, జలహక్కుల అంశాలపై విస్తృత చర్చ జరగాలని శ్రీదేవి మంత్రి పిలుపునిచ్చారు.
