మే 5న 33 జిల్లాల్లో సామూహిక నిరాహార దీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 5న రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు TGEJAC ప్రకటించింది.
206 సంఘాలతో ఏర్పడిన TGEJAC విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 100 మంది నిరాహార దీక్షలో పాల్గొనగా, నిరసన కార్యక్రమంలో 3000 మందికి పైగా హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా చైర్మన్లు, కన్వీనర్లకు సూచించారు. టెంట్, కుర్చీలు, మైక్ సిస్టమ్, మంచినీటి సదుపాయం, ప్రత్యేక వేదిక వంటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రధాన డిమాండ్లలో జూన్ 2లోపు PRC అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, CPS రద్దు చేసి OPS అమలు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల 15,35,000 మంది ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు నిర్వహిస్తున్న ఈ సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడమే ఈ దీక్ష లక్ష్యమని TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.